Thursday, August 29, 2013

తెలుగు భాషా దినానికి అశ్రుతర్పణం

ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా మహోత్సవ దినంగా జరుపుకోవాలని ఆధికారికంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 21వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషాదినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. అయితే వ్యావహారిక భాషోద్యమ సారథి గిడుగు పిడుగు జయంతిని మనం తెలుగుభాషా దినంగా పాటించాలని పెద్దలు తీర్మానించారు. ఈ సందర్భంగా ఒకసారి మన భాషా సంస్కృతుల నేపధ్యాన్ని కొంచెం స్మరించుకుందాం.
''నాగబు'' అనే పదం మొట్టమొదటి తెలుగుమాట. ఇందులో ప్రకృతి/పత్యయ విభా గం ఉంది. తొలి తెలుగురాజు ఆంధ్ర శాతవాహనులు. వారి కాలంలో ప్రాకృతానికి పట్టంపట్టడం జరిగింది. బృహత్క్థ (పైశాచీ ప్రాకృతం) గాథాసప్తశతివంటి గ్రంథాలు ప్రాకృతంలో ఉన్నాయి. ఐతే ఆనా డు సంస్కృత ప్రాకృతాలకు భిన్నంగా ''దేశి' అనే ఒక ప్రజా వ్యావహారిక భాష ఉండేది. ఇది తెలుగేనని పరిశోధకుల అభిప్రాయం. గాథాసప్తశతిలో రెండువందలకు పైగా తెలుగు పదాలున్నట్లు తిరుమల రామచంద్ర వంటి పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అత్త, పొట్ట, పత్తి, పంది, అయ్యో - వంటి పదాలు గాథాసప్తశతిలో ఉన్నాయి. తర్వాతి కమలాపురం, ఎర్రగుడిపాడు పండరంగని అద్దంకి శాసనాలలో తెలుగు క్రమంగా స్థిరీకరింపబడినట్లు సాక్ష్యాధారాలున్నాయి. అద్దంకి శాసనంలో దేశీయమైన తరువాజవృత్తం కన్పడుతున్నది. తూర్పు చాళుక్యులకు ముందు రాజులు తెలుగును ఆదరించిన ఆధారాలు అనే్వషణలో ఉన్నాయి.
పాల్కూరికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర ఆధారంగా నన్నయకు ముందున్న జానపద తెలుగుభాషా స్వరూపం నిర్వచింపబడింది. ముఖ్యం గా అది పద సాహిత్యమని తోస్తున్నది. వ్యావహారిక భాష వేరు. అధికారిక భాష వేరు. ప్రాకృతం తర్వాత దేశవ్యాప్తంగా సంస్కృతానికి ప్రాధాన్యం పెరిగింది.
11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య ప్రభువు తెలుగులో మహాభారత రచన చేయించటం తెలుగు భాషోద్యమంలో ఒక సువర్ణ ఘట్టం. ఆ తర్వాత వచ్చిన పాల్కురికి సోమనాధుడు జాను తెలుగును ప్రయోగించి వృషాధిప శతకంలో దానిని నిర్వచనాన్ని కూడా ఇచ్చాడు. ఇతడు త్రిలింగదేశాధిపతి అయిన ప్రతారుద్రుని కాలమునాటివాడు. ఈ త్రిలింగములు కాళేశ్వరము, దాక్షారామం, శ్రీశైలములు త్రిలింగశబ్దం తెలుగుగా నేడు తెలంగాణాగా మారింది. తెన్ అంటే దక్షిణము. తెనుగు అనేది దాక్షిణాత్య భాష అనే అర్థంలో ఆ పదం పుట్టి ఉండవచ్చు. తేనెవంటి భాష తెనుగు అనేది మరొక వ్యావహారిక నిర్వచనం. కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత త్రిలింగ దేశాన్ని ఢిల్లీ సుల్తానులు బహమనీలు, అసఫ్ జాహీలు దాదాపు ఏడు వందల సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో తెలంగాణలో తెలుగు సగర్వంగా తల ఎత్తుకోలేకపోయింది. పర్షియన్, ఉర్దూ భాషలు అధికార భాషలయినాయి. అంటే అవే బోధనాభాషలు వ్యవహార భాషలు కూడా కావటంలో 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణాలో ప్రజలు తెలుగులో మాట్లాడడానికి భయపడేవారు. 1952 బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం ఏర్పడే వరకు తెలుగుభాష అవమానాలకు గురి అవుతూనే వచ్చింది. ఇక ఆంధ్ర ప్రాంతంలో రెడ్డిరాజులు విజయనగర ప్రభువులు తెలుగును పోషించారు. క్రమంగా వారి శాసనాలు ఆధికారిక కార్యకలాపాలు తెలుగులో జరుగసాగాయి. బ్రిటీషువారి ఫ్రెంచి వారి ప్రభావంవల్ల ఆయా భాషాపదాలు తెలుగులో ప్రవేశించినా తెలుగు బతికి కట్టకలిగింది. భాషాపరంగా చూస్తే తెలంగాణా, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలల్లో మాట్లాడేది ఒకే తెలుగు అయినప్పటికీ అన్యభాషా ప్రభావంవల్ల యాస (స్లాంగ్)లలో మార్పు వచ్చింది. మాండలికాలు వర్గ మాండలికాలు భిన్నం గా ఉన్నాయి. పో-పోయండు, పోయ నాడు-యాడు, వళిపొచ్చాడు ఇలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇవి స్థూలం గా కన్పడే భేదాలేకాని మూలధాతువులు క్రియారూపాలు సారూప్యం కలిగి ఉన్నాయి. భాషాపరంగా చూస్తే నన్నయభట్టు రాణ్మహేంద్రవరమువాడే. అంటే కావ్యభాష తెలుగుకు శ్రీకారం చుట్టింది ఇక్కడే!
మద్రాసు రాష్ట్రంలో తెలుగువారిపై తమిళుల దాష్టీకం పెరిగింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం తర్వాత 1952లో విశాలాంధ్ర ఏర్పడింది.1948 సెప్టెంబర్ 17 తర్వాత నాటి హైదరాబాదు స్టేట్ (నిజాము రాజ్యం) మూడు ముక్కలైంది. అవి వరుసగా మరఠ్వాడ, కర్ణాటక, తెలంగాణ. 1956 నవంబర్ ఒకటవ తేదీన విశాలాంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్ప డ్డాయ.
ఇక భాషాపరంగా చూస్తే నన్నయభట్టు రాణ్మహేంద్రవరం వాడే. అంటే కావ్యభాష తెలుగుకు శ్రీకారం చుట్టింది ఇక్కడే. అయతే గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాషావాది. అంటే కావ్య భాష గ్రాంథికం. అదే పాఠ్యభాషగా కూడా ఉండేది. రామమూర్తిగారు మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే వ్రాయటం సమంజసం అన్నారు. దీనికే వ్యావహారిక భాషోద్యమం అని పేరు. మరి ఇన్నివందల వర్గ మాండలికాలమాటేమిటి? అని ఆలోచిస్తే ఒక ''ప్రామాణిక భాష'' లేదా శిష్ట వ్యావహారికం - అంగీకరించాలనే ప్రతిపాదన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగును అధికార భాషగా ప్రకటించింది. ఆధికార భాషా సంఘం ఒకటి ఏర్పరచి వివిధ పరిపాలనా రంగాలల్లో తెలుగును ప్రవేశపెట్టే కృషి జరిగింది. తెలుగు అకాడమీ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి ఈ దిశా నిర్దేశం చేసేందుకే ఏర్పడ్డాయి. ఐతే రాజకీయ కారణాలవల్ల భాషా సంస్కృతులకు గత అరవై సంవత్సరాలుగా బాలారిష్టాలు తప్పలేదు. యాస (స్లాంగ్) భేదం ఉన్నంత మాత్రాన సీమ - ఆంధ్ర - తెలంగాణా ప్రాంతాలల్లో మాట్లాడేది తెలుగు కాకుండా పోతుందా?
2002 యునెస్కో వారు చేసిన సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అతిత్వరగా నశించిపోయే భాషలలో తెలుగు కూడా ఒకటి అని తేల్చటం హృదయవిదారకమైన అంశం. భాషాభిమానులకు ఇది హెచ్చరిక వంటిది. ఈ కారణంలో తెలుగు క్రియారూపాలను గుర్తుకు తెచ్చుకోవడం ఇటీవల కొన్ని పత్రికలలో ఒక ఉద్యమంగా మార్చారు. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదే అయినా తెలుగు అటు ఉత్తరానికీ ఇటు దక్షిణానికి ఒక వారథిగా ఉంది.
గత పది సంవత్సరాలుగా ఈ భాషాప్రయుక్త రాష్ట్రాన్ని రాజకీయ కారణాలవల్ల విభజించాలనే ఉద్యమాలు ఊపునందుకున్నాయి. ఇందుకు మద్దతు పలికినవారు తమిళ తంబి చిదంబరం, కన్నడ నాయకుడు వీరప్ప మొయిలీ, మధ్యప్రదేశ్ ఫ్యూడల్ దిగ్గీరాజా కేరళకు కుట్టి ఆంటోనీ - ఇంకా క్లియోపాత్ర. వీరికి తెలుగుమీద ఇంత కక్ష ఎందుకా?? 42 పార్లమెంటు సీట్లు 15 కోట్ల జనం బలంగల భాషను నిర్వీర్యం చేస్తే నిస్సందేహంగా ఉత్తర భారతీయుల ఆధిపత్యం శాశ్వతమవుతుంది.
తెలుగు భాషకు మరొక ప్రమాద ఘంటిక ఆగస్టు 1వ తేదీ 2013 నాడు మ్రోగింది. ఇత్తెహాదుల్ మజ్లీస్ నాయకుడు లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ''కొత్తగా ఏర్పడే తెలంగాణా రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉండాలి'' అని కోరారు. ఈ కోరిక వెనుక ఏడువందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉందికదా! అదే జరిగితే తెలంగాణా ఉర్దూ భాషా రాష్ట్రం అవుతుంది. సీమాంధ్ర మాత్రమే ఒకే ఒక్క తెలుగు భాషా రాష్ట్రంగా మిగిలిపోతుంది.
గంజాం జిల్లాను ఒరిస్సాలో కలిపివేసి నందుకు నిరసనగా అభోజనుడై గిడుగు రామమూర్తి పంతులుగారు ఆంధ్ర సరిహద్దుకు వచ్చిన సంఘటన చరిత్ర విద్యార్థులకు గుర్తుండే ఉంటుంది. కాని ఇవ్వాళ ఏమి జరిగింది? కృష్ణగిరిలో తెలుగు పాఠశాల పెడితే తమిళులు భౌతిక దాడి చేశారు. పాండిచ్చేరిలో సంస్కృత శిక్షణా శిబిరం నిర్వహిస్తే డిఎంకె కార్యకర్తలు శిబిరాన్ని నేలమట్టం చేసి శారద విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు వారు మళ్లీ తిరుపతి మాది అని అంటున్నారు. తెలుగువాడు నేడు అనాథ. అనాదృతుడు. సోనియమ్మ ఇటలీ దేశం నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు తెలుగు భాషోద్యమాల గూర్చి తెలియకపోవటం సహజమే. ఆమెను నాయకురాలిగా అంగీకరించే వారికి కూడా తెలియదా??
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో దాదాపు యాభై లక్షలకు పైగా సీమాంధ్రులు స్థిరనివాసులై ఉన్నారు. (ఈ సంఖ్య యాభై లక్షలు అని ముఖ్యమంత్రి ప్రకటించారు) బహుశా వ్యాపారార్థం వచ్చిపోయే ఫ్లోటింగ్ పాపులేషన్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇతర తెలంగాణా జిల్లాలలో ఉన్నవారిని కలుపుకుంటే ఈ సంఖ్య కోటిన్నర కావచ్చు.) ఐతే హైదరాబాద్‌లో సమైక్య తెలుగుభాషా దినోత్సవం జరుపుతాము అంటే ''్భతికదాడులు'' జరుపుతాము అంటున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు రాజీనామాచేసి అతని గడ్డ వెళ్ళిపోయారు- ఇంకెక్కడి తెలుగు భాషా దినోత్సవం?? ఆంధ్రులు మొదటి నుండి నష్ట జాతకులు - తొలుత విశ్వామిత్రుని చేత నిష్కారణంగా శపింపబడ్డారు. (ఐతరేయ బ్రాహ్మణం) తర్వాత తమిళులు పీడిస్తే మద్రాసు వదులుకోని కట్టుబట్టలతో హైదరాబాదు వచ్చారు. ఇప్పుడు 'హైదరాబాదులో అధిర భాషగా ఉర్దూ ఉండాలి - సీమాంధ్ర భాగో' అంటున్నారు!!
కాన్‌స్టాంటి నోబుల్‌ను 14వ శతాబ్దంలో అరబ్బులు దండయాత్ర చేసి స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడి ప్రజలు లక్షల సంఖ్యలో కాందిశీకులైనారని ప్రపంచ చరిత్రలో వ్రాసి ఉంది. అలాగే జాషువా నాయకత్వంలో లక్షలాది యూదులు నిలువనీడలేక కట్టుబట్టలతో సుదీర్ఘ యాత్ర చేసినట్లు బైబిలులో ఉంది. కోట్లాది మంది తెలుగువారికి ఇప్పుడీ దుర్గతి తమ స్వంత రాష్ట్రంలోనే వచ్చింది. ''మరొక ఆప్షన్ లేదు వెళ్లిపోవలసిందే'' - అని భౌతికదాడులకు సిద్ధమవుతుంటే ఇంకెక్కడి తెలుగుభాషా దినోత్సవం?? ఇక మీద జరుగబోయే అధికార ఉర్దూ భాషాదినోత్సవం మాత్రమే!!
  • - ముదిగొండ శివప్రసాద్
  • 29/08/2013
  • No comments:

    Post a Comment